హైదరాబాద్, మే 22 : కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్లు అధికారం ఇచ్చినా తాగునీటి సమస్యను తీర్చలేదని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దాదాపు 90శాతం తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. హైదరాబాద్ మియాపూర్లో రిజర్వాయర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్.. తప్ప ఈ దేశంలో మరెవరూ ప్రకటించలేదన్నారు. ఇప్పటి వరకు 90 శాతం తాగు నీటి సమస్యలు తీర్చామని.. మరో 10 శాతం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చాలాకాలం పాటు అధికారంలో ఉన్నా.. సమస్యలను తీర్చలేని కాంగ్రెస్ అధికారం ఇస్తే ఏదేదో చేస్తామంటూ ప్రకటించడమేంటి.? అని హేళన చేశారు. రూ.1900 కోట్లతో 56 రిజర్వాయర్లను పూర్తి చేస్తామని.. అలాగే ఇంటింటికీ నల్లా పెట్టించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.