హైదరాబాద్, మే 20 : సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ నిర్వహిస్తున్న వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. ముగ్గురు మహిళలు దృష్టి మరల్చి ఖరీదైన మూడు చీరలను తీసుకొని పారిపోయార౦టూ ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరిట నటుడు ఉత్తేజ్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ షాప్ నిర్వాహణ బాధ్యతలను ఉత్తేజ్ భార్య పద్మావతి నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పటి మాదిరిగానే పద్మావతి షాపులో ఉండగా.. నిన్న సాయంకాల సమయంలో ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చారు. చీరలను కొంటున్నట్లు నటించి పద్మావతి దృష్టి మరల్చి మూడు చీరలను తీసుకొని పారిపోయారు. ఈ విషయాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉత్తేజ్, షాపులోని సీసీటీవీ ఫుటేజ్ ని అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళలు ఎవరన్న విషయమై ఆరా తీస్తున్నారు. దొంగిలించిన ఆ చీరల ఖరీదు రూ. 80 వేలు ఉంటుందని ఉత్తేజ్ పోలీసులకు వెల్లడించారు.