హైదరాబాద్, మే 9 : సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన మహానటి" చిత్రంలో కీర్తి సురేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఓవర్సీస్ లోనూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ప్రివ్యూను అమెరికాలో నిర్వహించారు. కేవలం ప్రివ్యూల ద్వారానే ఈ చిత్రం 2,30,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సినిమా మిలియన్ డాలర్ల క్లబ్లోకి సులభంగా అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సమంత, విజయ్ ఆంటోనీ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రంపై ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఎస్.ఎస్. రాజమౌళి, సైతం సినిమా అద్భుతం అంటూ కీర్తి నటన ఈ చిత్రానికి హైలెట్ అంటూ కొనియాడారు.