చెన్నై, మే 3 : అగ్ర కథానాయిక నయనతార వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నయన్.. మెగాస్టార్ చిరంజీవి సరసన "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాలేవీ ఒప్పుకున్నట్లు కనిపించట్లేదు. కాస్తంత బ్రేక్ తీసుకొని తన ప్రియుడు, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. వీరిద్దరూ కలిసి కాలిఫోర్నియాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను విఘ్నేష్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా "నా తారతో గొప్ప మ్యూజికల్ జర్నీ. గొప్ప అనుభవం" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య కాలంలో నయనతార.. ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని "నా తల్లిదండ్రులకు, కాబోయే భర్తకు ధన్యవాదాలు" అంటూ వెల్లడించిన విషయం తెలిసిందే.