హైదరాబాద్, జూలై 6 : మొన్నటి వరకు ఇంజనీరింగ్ విద్యార్థుల డ్రగ్స్ సరఫరా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే ఇటీవల ఒక్కసారిగా మరో కలకలం రేగింది. కెల్విన్ అరెస్టుతో కొన్ని పాఠశాలల్లో ఏడు, ఎనిమిదో తరగతుల విద్యార్థులు కూడా డ్రగ్స్ కు అలవాటుపడ్డారని, ఈ నేపథ్యంలో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన ఆవేదనను వాట్సప్ లో పంచుకున్నారు. ఆ మాటలు వాట్సప్ సహా పలు సోషల్ మీడియా వేదికలలో వైరల్ గా మారాయి. గత మూడేళ్ళుగా నెత్తినోరు బాదుకుంటూ వివిధ వేదికల్లో చెబుతూనే ఉన్నాను, విలేకరుల వాట్సప్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను. కానీ నా మాటలు వినేవారు లేకపోయారు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు సంతోషం అని ఆయన ఆవేదనను తెలిపారు. విషయంలోకి వెళితే.. ఓ అంతర్జాతీయ పాఠశాల బాలికలు వాటర్ బాటిల్ లో వోడ్కా కలుపుకుని షార్ట్ బ్రేక్ లో తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో హుడ్కా పేరుతో పిల్లలకు మాదకద్రవ్యాలు అలవాటు చేస్తున్నారు. కొత్తగా హుక్కా పెన్నులు వచ్చాయి. అవి చూడడానికి మామూలు పెన్నుల్లాగే ఉంటాయి. కానీ వాటినిండా మత్తెక్కించే పదార్థాలు ఉన్నాయి. వీటి సరఫరాను ఓ పిల్లవాడిచే ఒకరి ద్వారా ఒకరు మల్టీలెవల్ మార్కెటింగ్ పద్దతిలో వీటిని విస్తరిస్తున్నారు. మరో కోణంలో చూస్తే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఉండటం ఈ జాడ్యానికి కారణం అవుతున్నట్లు తెలిపారు. టీనేజి పిల్లలు ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు నీలిచిత్రాలను చూస్తున్నారు. వీటిని అరికట్టేందుకు పిల్లలకు రెగ్యులర్ గా కౌన్సెలింగ్ తరగతులతో పాటు తల్లిదండ్రులలోనూ వీటిపై అవగాహన తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోనే కాకుండా, సమాజంలో కూడా డ్రగ్స్ నిర్మూలనకు చర్చలు జరగాలి.