హైదరాబాద్, ఏప్రిల్ 25: కాంగ్రెస్లో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల్లో నిజం లేదని కొండా సురేఖ, కొండా మురళి అన్నారు. తెరాసలోనే ఉంటామని, గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమై, జనాల మధ్యే ఉండే నాయకులమని తెలిసే ముఖ్యమంత్రి కేసీఆర్ తమను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని వారు పేర్కొన్నారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామనే దుష్ప్రచారాన్ని కొందరు చేస్తున్నారని... అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. ఒకవేళ పార్టీ మారే ఆలోచనే ఉంటే బహిరంగంగానే వెళ్తామని, దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు...వచ్చే ఎన్నికల్లో తమ కూతురు సుస్మితా పటేల్ కు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని... కొండా దంపతులు ధీమా వ్యక్తం చేశారు.