హైదరాబాద్, ఏప్రిల్ 25 : టాలీవుడ్ లో గత కొన్నిరోజులుగా జరుగుతున్నా వివాదాలపై యావత్ సినీపరిశ్రమ హీరోలు మంగళవారం రాత్రి 7 గంటలకు సమావేశం అయ్యారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో ఈ సమావేశానికి వేదిక అయింది. నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణల నుంచి ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ చుట్టూ అల్లుకున్న వివాదాల వరకూ ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మెగా సమావేశంలో వెంకటేశ్, మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, సుమంత్, రామ్, నాని, నాగచైతన్య, వరుణ్ తేజ్, అఖిల్, రాజ్ తరుణ్ వంటి నటులతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, పి. కిరణ్, ఎన్వీ ప్రసాద్, కేఎల్ నారాయణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటి–నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న, నటి–నిర్మాత–దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారని సమాచారం. నటుడు బాలకృష్ణ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి, కొన్ని ఎలక్ట్రానిక్ చానల్స్పై ‘బ్యాన్’ గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 25 మంది ప్రముఖులు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.