న్యూఢిల్లీ, జనవరి 28 : దేశంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ట్రెండింగ్ న్యూస్ను గుర్తించడంతో పాటు, ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మరో అంతర్జాల హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద కాంట్రాక్ట్ పద్ధతిలో విలేకరులను ఎంపిక చేయనున్నారు. ప్రతి జిల్లాలో జరిగే విషయాలపై దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి వీరు పంపిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాఫ్ట్ వేర్ను రూపొందించేందుకు బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్), ప్రభుత్వ రంగం సంస్థ కింద టెండర్ను వేశారు.