హైదరాబాద్ ,అక్టోబర్ 03: హైద్రాబాద్ నగరంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. గుండెలో రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు వాటిని తిరిగి తెరిపించి రక్త ప్రసరణ పునరుద్దరించేందుకు వినియోగించే స్టెంట్లను తయారుచేసే పరిశ్రమను హైదరాబాద్ నగర శివార్లలో సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజస్ పార్కులో ఏర్పాటు కాబోతోంది. దీనిని ఏర్పాటు చేయబోతున్న సహజానంద మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భార్గవ్ కటాడియా మంగళవారం తమ సంస్థ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్ , ఆ శాఖ ముఖ్యా కార్యదర్శి జయేష్ రంజన్ లతో సమావేశమయ్యారు. రూ.250 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 2,200 మందికి పరోక్షంగా మరో అంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భార్గవ్ కటాడియా చెప్పారు. సుల్తాన్పూర్ యూనిట్ లో ఏడాదికి 12.5 లక్షల స్టెంట్లు, 20 లక్షల బెలూన్ కాథెటర్స్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. గుజరాత్ లోని సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ స్టెంట్ల ఉత్పత్తి, అమ్మకాలలో దేశంలో అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. సుల్తాన్పూర్లోని తమ సంస్థను మూడు దశలలో ఏర్పాటు చేస్తామని భార్గవ్ కటాడియా చెప్పారు.