న్యూఢిల్లీ, నవంబర్ 01 : వ్యాపార అనుకూల వాతావరణ కల్పనలో భారత్ తీరుగులేని పురోగతిని సాధించింది. వ్యాపార ప్రారంభం నిర్వహణకు వేర్వేరు దేశాలలోని నిబంధనల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఏటా కేటాయించే ర్యాంకులో భారత్ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది. 190 దేశాల జాబితాలో గతేడాది 130వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 100 వ ర్యాంక్ దక్కించుకుంది. మోదీ సర్కార్ అమలు చేసిన జీఎస్టీని పరిగణలోకి తీసుకోకుంటానే ర్యాంకులు కేటాయించిన ప్రపంచ బ్యాంకు భవిష్యత్తులో భారత్ మరింత ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. అంతేకాకుండా వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకోవడానికి గత నాలుగేళ్లుగా అమలు చేసిన సంస్కరణలు ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టంగా కనిపించాయి. రానున్న అయిదేళ్లలో దేశం 50వ ర్యాంకుకు చేరడానికి అవకాశాలున్నాయని స్వయంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులే ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో.. సింగపూర్ డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్ నిలిచాయి. ఇక భారత్లో రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన నూతన విధానాలూ ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఇందుకు నిదర్శనం. భారత్లోని 17 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం విశేషం. కాగా, ఆంధ్రప్రదేశ్కు 15వ స్థానం దక్కింది.