ఉగ్రదాడుల్లో ఆర్మీ జవాన్‌ మృతి

SMTV Desk 2018-04-12 16:58:05  terrarist attackarmy, jawan died Srikakulam:

పాతపట్నం, ఏప్రిల్ 12: జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో బుధవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పాతపట్నం మండలం ఎ.ఎస్‌.కవిటి గ్రామానికి చెందిన సాధ గుణకరరావు (25) అనే ఆర్మీ జవాన్‌ మృతి చెందాడు. తోటి డ్రైవర్‌తో కలిసి జీపులో వెళ్తుండగా ముష్కరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కుమారుడు మృతి వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శ్రీనగర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. విధి నిర్వహణలో భాగంగా మరో అసిస్టెంట్‌ డ్రైవర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున జీపుతో వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముందుగా అసిస్టెంట్‌ డ్రైవర్‌కు, తరువాత గుణకరరావుకు తూటాలు తగిలాయి. అసిస్టెంట్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గుణకరరావును ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటల సమయంలో గుణకరరావు మృతి చెందిన విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు తల్లి సాధ జయమ్మకు ఫోన్‌లో తెలియజేశారు.