SMTV Desk 2019-12-16 12:44:16  

కామాంధుడి చేతిలో నలిగిపోయానని ఎవ్వరికి చెప్పుకోలేక ఓ యువతి తన ప్రియుడికి చెప్పడంతో అతని వేధింపులతో మరింత నలిగిపోయింది. ఆపద సమయంలో అండగా నిలవాల్సిన వాడే ఆమెను మరింత వేధించాడు. దీంతో తట్టుకోలేకపోయిన బాలిక చివరికి బలవన్మరణానికి పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) తొమ్మిదో తరగతి చదువుతోంది.ఈ నెల ఏడో తేదీన రాత్రి సమయంలో ఆలయంలో జరిగిన భజన కార్యక్రమానికి హాజరై ఒంటరిగా తిరిగి వెళ్తోంది. ఆ సమయంలో బాలికపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మానికల రాజు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని తన ప్రియుడు మామిళ్ల సుబ్రహ్మణ్యానికి తెలిపింది.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యం బాలికతో నీచంగా ప్రవర్తించాడు. ‘నీ శీలం పోయింది. చెడిపోవావ్. బతికుండటం వేస్ట్.. చచ్చిపో’ అంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అది తాగిన తర్వాత స్కూల్‌కి వెళ్లిన బాలిక అక్కడే నురగలు కక్కుకుంటూ అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం గుంటూరుకు తరలిస్తుండగా చనిపోయింది. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో చింతలపూడి పోలీసులు రాజు, సుబ్రహ్మణ్యంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.