ఫ్లైఓవర్ల డిజైన్లలో సమూల మార్పులు!

SMTV Desk 2019-12-19 14:07:37  

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల డిజైన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మధ్య జరిగిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదం నేపథ్యంలో నగరంలో నిర్మిస్తున్న మరో మూడు ఫ్లైఓవర్ల డిజైన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అనేక వంపులు తిరిగి ఉండడం వల్లే ప్రమాదం తలెత్తిందని జీహెచ్ఎంసీ నియమించిన కమిటీ తేల్చిన సంగతి తెలిసిందే. భూసేకరణ విషయంలో రాజీపడడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కమిటీ నిర్ధరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మూడు చోట్ల నిర్మించనున్న ఫ్లైఓవర్ల విషయంలో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటి డిజైన్లలో వంతెన ప్రమాదకరంగా వంపులు తిరిగి ఉండడం వల్లే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న రూ.620 కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్, ఒవైసీ ఆస్పత్రి వద్ద, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిర్మించే ఫ్లైఓవర్ల డిజైన్ల విషయంలో సమూల మార్పులు చేయనున్నారు. వీటికి సంబంధించి తుది డిజైన్లు ఇప్పటికే ఖరారు కాగా, బయోడైవర్సిటీ కారు ప్రమాదం నేపథ్యంలో నిర్మాణ ఆకృతుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో దాని విషయంలో జరిగిన పొరపాటును భవిష్యత్తులో నిర్మి్స్తున్న వాటి విషయంలో చేయొద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఈ మూడు ఫ్లైఓవర్ల విషయంలో అవసరమైతే భూసేకరణ చేయడంలోనూ వెనకాడొద్దని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నారపల్లి నుంచి ఉప్పల్ జంక్షన్ దాటి రామాంతపూర్ రోడ్డులోని క్రికెట్ స్టేడియం వరకూ ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ వేను జాతీయ రహదారుల సంస్థ నిర్మించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ఎల్బీనగర్, సికింద్రాబాద్ వెళ్లా్ల్సిన వాహనాల కోసం జంక్షన్ వద్ద డౌన్ ర్యాంపులు నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవర్‌ను జంక్షన్ వద్ద ఉన్న మెట్రో రైలు మార్గం పై నుంచి నిర్మించాలని తొలుత ఓ డిజైన్ రూపొందించారు. దీని ప్రకారం ఫ్లైఓవర్ 18 మీటర్ల ఎత్తులో (మెట్రో స్టేషన్ 5.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది) ఉంటుంది. ఇంత ఎత్తులో జంక్షన్ దాటాక ప్రమాదకర మలుపు ఉండడంతో దీని డిజైన్ మార్చే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఒవైసీ ఆస్పత్రి వద్ద నిర్మించే వంతెనలు ఉక్కు వంతెనలు. నగరంలో మొదటిసారి ఉక్కు వంతెనలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వంతెనలు కనీసం మూడు నాలుగు కూడళ్లు దాటుకొని వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదకర మలుపులు తలెత్తుతున్నాయి. అవసరమైతే భూసేకరణ చేసి, ఈ ఫ్లైఓవర్ల విషయంలో మలుపులు తగ్గించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు.