గుంటూరు, ఏప్రిల్ 11: బడుగు నేత జ్యోతీరావు పూలేకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళగిరి పట్టణంలో జ్యోతిరావ్పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే ఆశయాలు యువతకు ఆదర్శమని అన్నారు. భారతదేశంలో నిమ్నకులాల అభ్యున్నతికి కృషి చేసిన పోరాటయోధుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకోసం చదువు కొవాలని ప్రోత్సహించి, స్వయానా ఆయనే పాఠశాలలను నిర్మించి, తన భార్య సావిత్రిబాయికి విద్యాబుద్ధులు చెప్పి, మహిళల కోసం తన భార్యను ఉపాధ్యాయురాలుగా నియమించిన స్ఫూర్తిప్రధాత అన్నారు. సామాజిక ఉద్యమ పితామహుడు జ్యోతిరావ్పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.