విజయవాడ, జూలై 2 : ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో బోనాల వైభవాన్ని సంతరించుకుంది. తెలంగాణలో జోరుగా రెండోవారం ఆషాడ మాస బోనాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారికి తెలంగాణ బోనాలను సమర్పించారు. తెలంగాణ రాజధాని నగరంలో పాత బస్తీ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు ఆదివారం బోనం సమర్పించారు. హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్విహించిన అనంతరం కమిటీ ప్రతినిధులు విజయవాడకు వచ్చారు. డప్పు వాయిద్యాలు, జానపద కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపుతో అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు సమర్పించారు. విజయవాడలో నిర్వహించిన ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రారంభించారు.