సుద్ద క్వారీలో ఇద్దరు బాలురు దుర్మరణం

SMTV Desk 2018-03-30 17:14:00  quarry workers, boys died

వెల్దుర్తి, మార్చి 30: సిద్ధినగట్టు సమీపంలోని ఓ సుద్ద క్వారీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. బోయనపల్లెకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ శ్రీను కుమారుడు వడ్డె నాగరాజు(17) జేసీబీ ఆపరేటర్‌గా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన దుబ్బరాజు కుమారుడు వడ్డే హరి(16) ఇంటి వద్ద ఖాళీగా ఉండడంతో వడ్డే నాగరాజు వెంట జేసీబీ హెల్పర్‌గా వెళ్లాడు. సిద్ధినగట్టు సమీపంలోని క్వారీలో సాయంత్రం పూట ఇద్దరూ సుద్ద తవ్వుతుండగా వీరు ఉన్న ప్రాంతం ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనలో వారు జేసీబీతో సహా దాదాపు 20 అడుగుల లోతులో పడ్డారు. ఆ తర్వాత పైనుంచి సుద్దపడడంతో అందులో కూరుకుపోయారు. జేసీబీ కోసం వచ్చిన కొందరు వారిని గుర్తించారు. వెంటనే సుద్దను తొలగించి జేసీబీ అద్దాలు బద్దలుకొట్టి వారిని వెలికి తీసి అనంతరం వారిని 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన వెంటనే హరి మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.