అమరావతి, ఫిబ్రవరి 23 : విభజన చట్టంలో ఉన్నవన్నీ పొందే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్రుల హక్కు అని ఆయన అభివర్ణించారు. విభజన హామీలను నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. హామీల అమలు సాధనలో రెండో ఆలోచనే లేదన్నారు. విభజన హామీలు విస్మరించడం వలెనే పోరాట పంథాను ఎంచుకున్నామని సీఎం స్పష్టంచేశారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని, రాజకీయ జీవితంలో అన్నీ కోణాలు చూశానని చెప్పారు. ఐదు నదుల అనుసంధానం చేసి మహా సంగమం ఏర్పాటుచేస్తామని, మహా సంగమం ఏర్పాటైతే కరవు అనేది ఉండదని వెల్లడించారు.