అనంతపుర౦, జనవరి 28 : "నా జీవితాంతం ప్రజల కోసమే పోరాడుతా" అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించిన ఆయన.. అనంతపురం జిల్లాకు ఏమైనా చేస్తే తన జీవితం ఇక ధన్యమైనట్లేనన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను రెండు ఎన్నికల తర్వాత వెళ్లిపోయేవాడిని కాదు. నా జీవితకాలమంతా ప్రజల కోసమే పోరాడుతా. ప్రజల అండదండలు ఉంటే సమస్యల పరిష్కారం కోసం.. కేంద్రాన్ని కూడా నిలదీస్తా. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నా" అన్నారు. అనంతపురం జిల్లా అభివృద్దికి ప్రకృతి అనుకూలంగా లేకపోవడం దురదృష్టకరమన్న పవన్, మానవ మేధస్సు ఎంతో గొప్పదని, ఎంతటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అన్నారు.