శ్రీహరికోట, జనవరి 11: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ40 నింగిలోకి దూసుకెళ్లనుంది. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ పీ కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి గురువారం తెల్లవారుజామున 5.29 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ఎల్వీ సీ40 ద్వారా 1,323 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 710 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2 సిరీస్లో ఐదో ఉపగ్రహంతో పాటు దేశీయంగా ఒక సూక్ష్మ ఉపగ్రహం, మరో బుల్లి ఉపగ్రహంతో పాటు ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ప్రయోగించనున్నారు. గతేడాది ఆగస్టు 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 విఫలమైనందున ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగానికి సిద్ధమయ్యారు.