చిత్తూరు, జనవరి 09: దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆటో మొబైల్ హబ్ గా తయారు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలియచేశారు. చిత్తూరుజిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరులో అపోలో టైర్ల ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కొత్త పరిశ్రమలు రావడం సంతోషించదగ్గ విషయమని కొత్త పరిశ్రమల రాకతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 2022సంవత్సరానికి అభివృద్దిలో దేశంలోనే ఏపీని మొదటి మూడు స్థానాల్లో నిలుపుతామని ఆయన పేర్కొన్నారు. శాశ్వతంగా పేదరికం పోవాలన్నా, యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా కొత్త పరిశ్రమల ఏర్పాటు అవసరమన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం మాని, చేస్తున్న అభివృద్దిని కళ్ళు తెరిచి చూడాలన్నారు. బయోటెక్నాలజీ, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్లలో ఏపీ ముందుకు దూసుకుపోతోందన్నారు. ఏపీలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.