జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తా - నాని

SMTV Desk 2017-06-20 17:44:42  Chitoor District,TDP,Press meet,Chandrababu, Lokesh

చిత్తూరు, జూన్ 20 : చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీనీ గెలిపించి, బలోపేతం చేస్తానని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జిల్లాలో పార్టీ పగ్గాలు అప్పగించినందుకు వారి నమ్మకాన్ని నిలబెడుతానని, తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, దొరబాబులతో పాటు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండించారు. ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఏమీ చేయడం లేదన్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ యాదవ్‌ మాట్లాడుతూ.. ప్రణాళికా బద్దంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు, ఎమ్మెల్యే సత్యప్రభ, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్‌ వైవీ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.