దెందులూరు, జనవరి 7 : పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విహారం కోసం వచ్చిన ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థుల కథ విషాదాంతంగా ముగిసింది. ఈత కోసం వచ్చిన నలుగురు విద్యార్ధులు వట్లూరులో చెరువులో విగత జీవులుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు తొలుత గుమ్మి విజయశంకర్(22) మృతదేహం గుర్తించిన పోలీసులు తర్వాత మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చింతలపూడికి చెందిన గుమ్మి విజయశంకర్(22), అంకాల సాయికిరణ్ పరశురాం(22), కలిదిండి హరికృష్ణరాజు(22), కోట సాయి(21) మరణించారు. వీరి మృతితో తల్లిదండ్రులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.