విశాఖపట్నం, జనవరి 7 : రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ రోగులకు సాయం కోసం విశాఖ బీచ్ రోడ్డులో నేడు వైజాగ్ గోయింగ్ పింక్ పేరిట 10కె, 5కె, 3కె పరుగులను నిర్వహించారు. బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, నగర ట్రాఫిక్ ఏసీపీ కింజరపు ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలకోసం నిర్వహించిన ఈ పరుగులో మహిళలతో పాటు చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకుండా కొంతమంది తల్లులు తమ చంటి పిల్లలను భుజాన వేసుకుని మరి పరుగు తీశారు. ఈ సందర్భంగా నటుడు మిలింద్ సోమన్ మాట్లాడుతూ...రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం అయిందని మూడోసారి ఆర్కే బీచ్ వద్ద జరగడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. కాగా, ఈ పరుగు ప్రారంభానికి ముందు మహిళలు నృత్యాలతో సందడి చేశారు.