అమరావతి, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 6న డీఎస్సీ ప్రకటన సందర్భంగా వెల్లడించిన 12,370 పోస్టులకు అదనంగా 1930 ఉద్యోగాలు చేరాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య 14,300గా తేలింది. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారులతో కమిషనర్ సంధ్యారాణి కసరత్తు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా ఖాళీల జాబితా సిద్ధమైనప్పటికీ రిజర్వేషన్ విభాగం, ఇతర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆర్థిక శాఖ అనుమతి వచ్చాక ఖాళీల ఆధారంగా జాబితాను ఏపీపీఎస్సీకి అప్పగించనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ జారీ సంక్రాంతి తర్వాతే ఉండొచ్చని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.