అమరావతి, డిసెంబర్ 16: అధికారంలోకి రాగానే బెల్టుషాపుల రద్దుకు సంతకం పెట్టి దానిని అమలు చేయకపోగా విచ్చలవిడిగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేత జగన్ దుయ్యబట్టారు. ఈ మేరకు కొన్ని అంశాలను పేర్కొంటూ ముఖ్యమంత్రికి జగన్ ఒక బహిరంగ లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ అసువులు బాసిన ముదునూరి సుబ్బమ్మ మరణానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, అందుకు పూర్తి బాధ్యత ఆయనే వహించాలని జగన్ ఆరోపించారు. బెల్టు షాపులన్నీ రెండో సంతకంతో రద్దు అని గ్రామాల్లో నివాసాల మధ్య, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, స్కూళ్ళ పక్కన మద్యం షాపులకు నాలుగు రెట్లు అనుమతులిచ్చిన ప్రభుత్వం మీదేఅని ఆయన విమర్శించారు. పూర్తిగా, బేషరతుగా వ్యవసాయ రుణ మాఫీ అని ప్రకటించి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు ఇప్పటికి కేవలం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రైతుల వడ్డీలు, చక్రవడ్డీలు లెక్క వేస్తే అవే మీ రుణమాఫీ కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ ఉన్నాయి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగ నీతులకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతో౦ద౦టూ జగన్ ఆరోపించారు.