వాషింగ్టన్, డిసెంబర్ 13 : ప్రతి ఏడాదిలో భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో టెక్ నిపుణులు హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం పొందుతున్నారు. అయితే, ఈ వీసా ఉన్న వారికి అరుదైన అవకాశం దొరికింది. సాధారణంగా ఈ వీసా ఉన్నవారు తమ దేశంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో విధులు నిర్వహించొచ్చని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) పేర్కొంది. కానీ కొత్త ఉద్యోగులు ఈ ఐ-129 పిటిషన్ తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసని పేర్కొంది. ఒక ఆర్థిక సంవత్సరానికి గానూ 65వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే జారీ చేస్తారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలు, లాభాపేక్షలేని పరిశోధన సంస్థల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ పరిమితి కిందకు రారు. వారికి అదనంగా ఈ వీసాలు అందిస్తారు. భారత్ నుంచి చాలా వరకు ఉద్యోగులు ఈ వీసా కోసం ప్రయత్నిస్తుంటారు.