విజయవాడ, డిసెంబర్ 13 : బెజవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న కనకదుర్గమ్మను వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. భవానీ దీక్షా విరమణ ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నేడు ఉదయం నుంచే భవానీలు పెద్ద ఎత్తున నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకుంటున్నారు. అనంతరం వినాయక ఆలయం నుంచి క్యూ పద్ధతితో ప్రవేశించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహామండపం వద్ద గురుభవానీల సమక్షంలో ఇరుముడులు సమర్పించి హోమగుండంలో నేతి కొబ్బరికాయలు వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో భవానీల సంఖ్య పెరగడం దృష్ట్యా అధికారులు లడ్డూల పంపిణీలో పరిమితి విధించారు. ఒక్కొక్కరికి 20లడ్డూలు చొప్పున ఇస్తామని వెల్లడించారు. కాగా, దుర్గమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకోవడంతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.