అమరావతి, డిసెంబర్ 02 : నేడు శాసనసభ వేదికగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఇందిరా సాగర్ వద్ద సమావేశమై, పోలవరం ప్రాజెక్టు విషయంపై ప్రస్తావించారు. పోలవరంపై కేంద్రం పంపిన లేఖలో ఏ స్పష్టత లేకపోయిన, రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. ప్రాజెక్టు పనులకు నవంబర్ 16వ తేదీన టెండర్లు పిలిచి, 30వ తేదీ వరకూ ఆన్లైన్లో ఎందుకు అప్లోడ్ చేయలేదని మాత్రమే కేంద్రం పంపిన లేఖలో ఉందన్నారు. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వాన్ని కేంద్రం లేఖపై తప్పుదోవ పట్టించారని అన్నారు. తొలుత రూ. 1395 కోట్లకు ఆహ్వానించిన టెండర్లను కేవలం 14 రోజుల వ్యవధిలో 1483 కోట్లకు, ఎందుకు పెంచారని కేంద్రం అడగటంలో తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమ ఆస్తులను ప్రజలకు పంచాల్సిన పని లేదని, వాళ్ల ఆస్తులను లాక్కోకుండా ఉంటే చాలునని అన్నారు. పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందన్నారు. అధికారులు వాస్తవాలు చెప్పి ఉంటే ఇంత రాద్దాంతం జరిగేది కాదని ఆయన చెప్పారు.