కర్నూలు, నవంబర్ 27: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. 19వ రోజు కర్నూలు జిల్లా వెంకటగిరి నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన వెంట నడిచేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. మార్గమధ్యలో తనను కలిసిన వారందరితో ప్రేమగా మాట్లాడారు. కరచాలనాలు చేశారు. సెల్ఫీలు దిగారు. అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. కోడుమూరు సోమప్ప కోట సర్కిల్, కోడుమూరు కొత్త బస్టాండ్, వక్కూరు ఎస్సీ కాలనీ మీదుగా ఈ రోజు యాత్ర కొనసాగుతుంది. వక్కూరు ఎస్సీ కాలనీలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. కోడుమూరు సోమప్ప సర్కిల్లో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. తాగునీరు, సాగునీరు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం తదితర సాగు సమస్యలపై చర్చిస్తారు. వేముగోడులో ఈరోజు పాదయాత్రను ముగించి, అక్కడే బస చేస్తారు. 18 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన వైఎస్ జగన్ 254.7 కిలోమీటర్లు నడిచారు.