అమరావతి, నవంబర్ 20: నంది అవార్డులపై హైదరాబాద్ లో కూర్చుని కొందరు విమర్శలు చేస్తున్నారని, వారికి ఎపిలో ఓటర్ కార్డు కాని, ఆధార్ కార్డు కాని లేవని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. సినిమా అవార్డులపై విమర్శలు చేసేవారు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని ఆయన వ్యాఖ్యానించారు. జ్యూరీలో సభ్యులుగా ఉన్నవాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పకడ్బందీగా జ్యూరీ ఏర్పాటు చేసి మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే ముఖ్యమంత్రిపై కొందరు హైదరాబాద్లో కూర్చుని విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా బాద పడ్డారని ఆయన అన్నారు. ఇద్దరు ముగ్గురు చేసే విమర్శలను ఒకటి రెండు చానళ్లు ప్రముఖంగా చూపించాయని ఆయన అన్నారు. అసలు అవార్డులు ఇవ్వని ప్రభుత్వాన్ని ఏమీ అనని వాళ్లు ఇచ్చిన తమకు రాళ్ల దెబ్బలు వేస్తున్నారని లోకేష్ అన్నారు. ఇక్కడ స్థానికత లేనివారికి విమర్శలు చేసే హక్కు లేదని ఆయన చెప్పారు.