అమరావతి, నవంబర్ 20 : కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన అప్పులన్నీ కొడుకు జగన్ ఎదుగుదలకే తప్ప రాష్ట్ర అభివృద్ధికి కాదని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. రాజశేఖర్రెడ్డి పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర అప్పు రూ.57వేల కోట్లు ఉంటే ఐదేళ్ల కాలంలో అది రూ.1.08లక్షలకు చేరిందని ఆయన ఆరోపించారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ అదే అధికారం చేపట్టిన తరువాత మద్యాన్ని ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ది ప్రజా సంకల్పయాత్ర కాదని, అబద్ధాల యాత్రని ఆయన మండిపడ్డారు. వైఎస్ హయాంలో 14వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అదే ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు వచ్చాక వారికి భరోసా కల్పించారన్నారు. అవినీతి ద్వారా రూ.లక్ష కోట్లకు పైగా అక్రమాస్తులు పోగేసుకున్న జగన్ మాటలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన ఎద్దేవాచేశారు.