అమరావతి, నవంబర్ 14 : "లక్ష్మీస్ వీరగ్రంథ౦" సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను అగౌరవపరిచేలా సినిమా తీస్తున్న కేతిరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించారు. తన అనుమతి లేకుండా తన సినిమానే ఎలా తీస్తారని ఘాటుగా స్పందించారు. కొంచెం కూడా సంస్కారం లేకుండా.. విడాకులు తీసుకున్న వ్యక్తితో ముడిపెట్టి తన చరిత్రను సినిమాగా తీస్తుండటం నీచమని అన్నారు. ఈ విషయాలపై చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. సినిమా పోస్టర్ అయితే అత్యంత దారుణంగా ఉందని తల్లి, చెల్లి ఉన్న ఎవరూ కూడా ఇంత నీచంగా వ్యవహరించరని ఆవేదన వ్యక్తం చేశారు. కేతిరెడ్డిలాంటోళ్లు ప్లాట్ ఫామ్ గాళ్లని, వీళ్ల వెనుక ఉన్న వేరే వ్యక్తుల గురించి ఈ మాటలు మాట్లాడుతున్నానని చెప్పారు. ఇలాంటి సినిమాలతో ఎన్టీఆర్ ఆత్మ ఎంతో క్షోభిస్తుందని అన్నారు.