విశాఖ, నవంబర్ 13 : అరకులోయలో ఈనెల 14, 15, 16 తేదీల్లో అంతర్జాతీయ స్థాయి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ వేడుకలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇటలీ, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిఫ్పైన్స్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, స్పెయిన్, యూఎస్ఏల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. ఇప్పటికే 6,200 మంది ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారని.. ఈ రెండు రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. డ్రా తీసి రోజుకు 300మందికి మాత్రమే బెలూన్లలో ఎగిరే అవకాశం కల్పిస్తామన్నారు. 13 దేశాల నుంచి 16 బృందాల పైలెట్లు తమ బెలూన్లతో విన్యాసాలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ లో స్థానిక గిరిజనులు పాల్గొనే౦దుకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే విశాఖలో నిర్వహించిన దసరావళి, ఆనంద దీపావళి, సౌండ్స్ ఆన్ శాండ్ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు.