అమరావతి, నవంబర్ 10 : పట్టిసీమతో చరిత్ర సృష్టించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నదుల అనుసంధానాన్ని పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పోలవరాన్ని ఆపేది లేదని, కట్టి తీరతామని స్పష్టం చేశారు. వీటన్నింటిపై ప్రజలలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారని అందువల్ల నదుల అనుసంధానం పూర్తైతేనే నీటి కష్టాలు తీరతాయని అభిప్రాయపడ్డారు. పట్టిసీమ వల్ల మొదటిసారి 4.21 టీఎంసీల నీటిని తీసుకొచ్చి రూ.2,500 కోట్లు విలువైన పంటను కాపాడినట్లు వివరించారు. ముమ్మరంగా నదుల అనుసంధానం సాగుతోందని పేర్కొన్నారు. నదుల అనుసంధానంపైనా, ప్రాజెక్టుల గురించి సుదీర్ఘంగా ప్రసంగించిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.