తెనాలి, నవంబర్ 08: ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎ౦పి, న్యాయవాది, స్వతంత్ర సమరయోధుడు సింగం బసవ పున్నయ్య మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. కృష్ణా జిల్లా మోడుముడి ఆయన స్వగ్రామం. తొలుత న్యాయవాదిగా పనిచేసిన ఆయన, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. తెనాలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై విజయం సాధించి 9వ లోక్ సభలో ఎంపీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, సినీ నటి శారదపై ఆయన ఓడిపోయారు. బసవ పున్నయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.