విశాఖపట్నం, నవంబర్ 07 : విశాఖ పోలీసులు రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డారు. మధుర వాడలో 3 కిలోల బంగారం దొంగతనం దర్యాప్తు కోసం విశాఖ పోలీసులు రాజస్థాన్ కు వెళ్ళారు. చోరీ సొత్తును రికవరీ చేసేందుకు మధుర వాడ ఇన్స్పెక్టర్ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, పరవాడ ఎస్సై షరీఫ్, మహారాణిపేట ఎస్సై గోపాలరావు, వన్టౌన్ కానిస్టేబుల్ లాలు ప్రసాద్ బృందం విశాఖ నుండి రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్ళింది. ఈ కేసు నుండి తప్పించాలంటే రూ. 2 లక్షలు ఇవ్వాలని నిందితుల నుండి డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వారి నుండి లంచం తీసుకుంటుండగా రాజస్థాన్ అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. లిట్మస్ టెస్ట్ చేసి అన్ని ఆధారాలను సేకరించారు. నగదును సీజ్ చేశారు. కాగా ఈ అరెస్ట్ ను నగర పోలీసు కమిషనర్ యోగానంద్ ధృవీకరించారు.