అమరావతి, అక్టోబర్ 12 : దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వచ్చాంధ్రప్రదేశ్ లో భాగంగా రానున్న ఆరు నెలల్లో 20 లక్షల మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. ఇందుకోసం కొత్తగా ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖ, తిరుపతి, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లలో మూడు ట్రీ మెయిన్టెన్స్ ప్లాట్ ఫారం యంత్రాల్ని అందుబాటులోకి తెస్తున్నామంటూ" పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ, స్వచ్ఛ ఆంధ్రా మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సిఎల్. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.