న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు పురస్కారం ఇవ్వాలంటూ గత కొంత కాలంగా తెలుగు ప్రజలు ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై తాజాగా కేంద్రం స్పందించింది. ఇలాంటి అత్యున్నత పురస్కారాల విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటారని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి సమాచారం పంపినట్లు కేశినేని నానికి హోంశాఖ కార్యదర్శి తెలిపారు. అయితే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ జులై 19న లోక్సభలో ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు. ఎన్టీఆర్కు ఈ పురస్కారం 377 నిబంధనకు లోబడి ఇవ్వాలని ఆయన లోక్ సభలో కోరిన విషయం తెలిసిందే.