రాజమండ్రి, సెప్టెంబర్ 11: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఇంటికి వెళ్లారు. అయితే వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇటీవల వెలువడిన కాకినాడ, నంద్యాల ఫలితాలతో కాపు సామాజిక వర్గం తెదేపాకి వ్యతిరేకంగా లేదని స్పష్టమైన తరుణంలో ముద్రగడ, గోరంట్లతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాపు సామాజికవర్గంలో ఎంతో కొంత పట్టు ఉన్నటువంటి ముద్రగడను, టీడీపీలోకి తీసుకుంటే పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడుతుందనే భావన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చలు సాగుతున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన గోరంట్ల ఈ భేటిని రాజకీయం చేయవద్దని, కేవలం వ్యక్తిగత సమావేశమేనని తెలిపారు.