అమరావతి : ఎపి అసెంబ్లీ స్పీకర్ గా ఆముదాలవలస వైసిపి ఎంఎల్ఎ తమ్మినేని సీతారాంను నియమించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. శుక్రవారం సీతారాం సిఎం జగన్ తో భేటీ అయ్యారు. కళింగ (బిసి) సామాజిక వర్గానికి చెందిన సీతారాం ఇప్పటి వరకు ఆరుసార్లు ఎంఎల్ఎగా గెలిపొందారు. 1983లో ఆయన మొదటిసారి ఎంఎల్ఎ గా విజయం సాధించారు. 1985 ప్రభుత్వ విప్ గా, 1994లో చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా సీతారం పని చేశారు. ఇటీవల జరిగిన ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస స్థానం నుంచి టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఎ కూర రవికుమార్ పై సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సీతారాంకు 77,233 ఓట్లు రాగా, కూన రవికుమార్ కు 63,377 ఓట్లు వచ్చాయి. జన సేన అభ్యర్థి పిడాడ రామ్మోహన్ రావు మూడో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి నాల్గో స్థానంలో నిలిశారు. అందరితో కలుపుగోలుగా ఉండే సీతారాంకు సౌమ్యుడు అన్న పేరుంది. దీంతోనే ఆయన్ను అసెంబ్లీ స్పీకర్ గా నియమించాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వైసిపి శ్రేణులు చెబుతున్నాయి.