నాలుగు దశాబ్దాల టీడీపీ......చూడని ఓటమి - సంఖ్య సింగిల్‌ డిజిట్ కి చేరనుందా?

SMTV Desk 2019-05-28 16:11:27  tdp

1982 మార్చి 21న అప్పటి సినీ స్టార్‌ నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని ప్రారంభించారు. అప్పటి నుండి కూడా తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఆధరాభిమానాలను దక్కించుకుంటూనే ఉంది. అధికారం కోల్పోయిన సమయంలో కూడా గౌరవ ప్రధమైన ప్రతిపక్ష పార్టీగా కొనసాగింది. కాని ఈసారి మాత్రం మరీ దారుణమైన ఫలితాన్ని చవి చూసింది...

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సంవత్సరంలోపే అధికారంలోకి తీసుకు వచ్చారు. ఎన్టీఆర్‌ సీఎంగా తనదైన ముద్రను వేశారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతలను తీసుకున్న విషయం విదితమే. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కూడా పార్టీ మరింత బలపడింది.

2004వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యాడు. ఆ సమయంలో రాజశేఖర్‌ రెడ్డి జోరు ముందు సైకిల్‌ పంచర్‌ అయ్యింది. కాని ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక గౌరవ ప్రధమైన నెంబర్‌ను టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో మరోసారి రాజశేఖర్‌ రెడ్డి ప్రభంజనంలో చంద్రబాబు నాయుడు నెగ్గుకు రాలేక పోయాడు. అయినా అప్పుడు కూడా మంచి సీట్లను..... ఓట్లను..... దక్కించుకున్నారు.

ఇక 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు చాలా స్వల్ప తేడాతో వైకాపాను ఓడించి అధికారాన్ని దక్కించుకున్నారు. తెలుగు దేశం పార్టీ గత చరిత్రను చూస్తే మరోసారి అంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు.

కానీ 2019 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేసినా కూడా జనాలు మాత్రం జగన్‌ను కావాలనుకున్నారు. జగన్‌ సీఎం అయితే తమ బతుకులు మారుతాయని భావించినట్లుగా ఉన్నారు.

అయితే ఇక్కడ జగన్‌ సీఎం అయితే మరోసారి తెలుగు దేశం పార్టీ పుంజుకుని గెలుపుకోసం ప్రయత్నించవచ్చు అనుకోవచ్చు. కాని తెలుగు దేశం పార్టీకి ఈసారి దారుణ పరాభవం ఎదురైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం 25 స్థానాలను కూడా గెలవలేక పోయింది. మంత్రులు, కీలక నేతలు ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ కూడా గెలిచే పరిస్థితి లేదు.

ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా పార్టీకి రాలేదు. తెలుగు దేశం పార్టీ ప్రారంభించి దాదాపుగా నాలుగు దశాబ్దాలు అయ్యింది. ఇంత తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటం పార్టీ చరిత్రలోనే తొలిసారి.

2024 అసెంబ్లీ వచ్చే ఎన్నికల నాటికి తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్‌ అవుతారా? లేదా అనే విషయం చెప్పలేము. జగన్‌ ఖచ్చితంగా టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లుగా 10 నుండి 15 మంది ఎమ్మెల్యేలను అయినా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అదే జరిగితే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య సింగిల్‌ డిజిట్ కి పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది టీడీపీ శ్రేణుల అంచనా.