రాయలసీమలో జలకళ తెప్పిద్దాం

SMTV Desk 2019-05-26 16:53:32  rayalaseema, Water,

ఏపీ కాబోయే సీఎం జగన్ ఇవాళ సతీసమేతంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్న కేసీఆర్, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళదామని జగన్ కు సూచించారు. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం మూడున్నర వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, తెలంగాణ 800 టీఎంసీలు నీరు వినియోగించుకుంటుందని, మిగతా నీరంతా ఏపీ వాడుకోవచ్చని ఆయన చెప్పినట్టు సమాచారం. అంతే కాక ప్రకాశం బ్యారేజ్ నుంచి సోమశిలకు గ్రావిటీ ద్వారా నీళ్లను పంపించే వెసులుబాటు ఉందని, తద్వారా రాయలసీమలో జలకళ చూడొచ్చని కేసీఆర్ జగన్ కు సూచనలు చేసినట్టు సమాచారం.

త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి దీనిపై చర్చించుకుందామని కేసీఆర్ ఈ సందర్భంగా జగన్ కు ప్రతిపాదించారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచరం. లివ్ అండ్ లెట్ లివ్ తమ విధానమని మహారాష్ట్ర సీఎంకు చెప్పానని వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని వివరించానని దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చినట్లు తెలిపారు. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నామని జగన్‌తో కేసీఆర్ అన్నట్టు చెబుతున్నారు. ఏపీతోనూ ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది తమ విధానమని కేసీఆర్ అన్నారని చెబుతున్నారు.