లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, దానిలో తెరాస, టిడిపి, వైసీపీలు చేరవచ్చునని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్తో రహస్య అవగాహన ఉన్నందునే జగ్గారెడ్డి పార్టీకి నష్టం కలిగించేవిధంగా మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
“విజయశాంతి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుకొంటున్నారేమో? కానీ కాంగ్రెస్ పార్టీని నడిపించాలంటే ఒట్టి మాటలు సరిపోవని ఆమె గ్రహించాలి,” అని అన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకోదలిస్తే పార్టీలో రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి సోదరులు వంటి సీనియర్లు అనేకమంది ఉన్నారని జగ్గారెడ్డి అన్నారు. ఆ జాబితాలో ఆమె పేరు పేర్కొనకపోవడం వలననే ఆమెకు ఆగ్రహం కలిగి ఉండవచ్చునన్నట్లుంది జగ్గారెడ్డి పొంతనలేని సమాధానం.