ఆత్మహత్య చేసుకున్నవాళ్లకి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

SMTV Desk 2019-05-05 18:20:57  Bandaru dathatreya

తెలంగాణ ఇంటర్‌ బోర్డు వివాదాలపై బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని.. ఈరోజు కూడా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ... ఇంత జరుగుతున్నా కేసీఆర్ సరైన రీతిలో స్పందించడం లేదని.. గ్లోబరీనా సంస్థను, విద్యాశాఖ మంత్రిని, ఇంటర్ బోర్డ్ అధికారులను ప్రభుత్వం వెనుకేసుకొస్తుండటం దారుణమని విమర్శించారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఈరోజు నుంచి పరామర్శిస్తామని తెలిపిన ఆయన.. మే 7, 8 తేదీన రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కలిసి మెమోరాండం సమర్పిస్తానని కూడా దత్తాత్రేయ వివరించారు.