అమరావతి: ఫణి తుఫానుతో ఇన్ని రోజులు భయాందోలనకు గురైన ఏపీ ప్రజలు ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల మళ్ళీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పనులపై ఇళ్ల నుంచి బయటికొచ్చే వారు ఎండవేడికి తాళలేక అవస్థలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు శరీరానికి మంటపుట్టిస్తున్నాయి. దీంతో వీధుల్లో వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు, పనులపై బయట తిరిగే సాధారణ జనం వడదెబ్బ బారినపడుతున్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.పోలవరంలో శనివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.