నంద్యాల, ఆగస్ట్ 22: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్షాలు భారీ స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయం సుపరిచితమే. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ మహిళ ఫోటో చూపిస్తూ ఈమెను అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. ఈ సంఘటన వెనుక వైకాపా నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే తాను బతికే ఉన్నానంటూ ఆ మహిళ నేడు మీడియా ముందుకు రావడం వివాదాస్పదమైంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ మరణించిన మహిళ తాను కాదని, వేరే అమ్మాయని తెలుపుతూ, లోకల్ ఛానల్లో తన ఫొటోను తరచూ చూపిస్తున్నారని షమీమ్ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె, తనను బలి చేయడంపై కన్నీరు పెట్టుకుంది. తమ కుటుంబంపై ఈ విధమైన అవాస్తవ ప్రచారం చేస్తున్నందుకు కుటుంబీకులు మండిపడుతున్నారు.