ఎస్పీవై మృతికి రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సానుభూతి

SMTV Desk 2019-05-01 13:51:00  spy

నంద్యాల: నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, చంద్రబాబు అలాగే ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లు సానుభూతి తెలిపారు. కాగా, నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి.. ఏప్రిల్ 3న కేర్ ఆసుపత్రిలో చేరారు. ఎస్పీవైరెడ్డి మరణవార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్పీవై రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకా లమ్మ గూడూరులో 1950లో జన్మించారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్‌ సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు.