నంద్యాల, ఆగస్ట్ 19: మరో మూడు రోజుల్లో నంద్యాల ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ, నంద్యాలలో భారీగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. తెదేపా అధినేత, ఏపీ సీఎం నేటి నుండి నియోజక వర్గంలో ప్రచారం చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ ఉదయం ఆయన రోడ్ షో మొదలైంది. ఆయనతో పాటు ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కూడా పాల్గొన్నారు. ఒకడేమో నాకు ఛానల్ లేదు, పేపర్ లేదని అంటున్నాడని... మరి ఆ ఛానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్ అంటూ, ఇటివల జగన్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా వేణుమాధవ్ ప్రశ్నలు సంధించారు. రోడ్ షోలో వేణుమాధవ్ మాట్లాడుతూ... కర్నూలు నుంచి నంద్యాలకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎటు చూసిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రొక్లైనర్లే దర్శనమిస్తున్నాయని తెలిపారు. నా బిడ్డలైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడటమా... థూ... నీచం, నికృష్టం అంటూ ఎద్దేవా చేశారు. కొందరు పార్టీ గుర్తు పట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు, మనకు ఆ అవసరం లేదు మన గుర్తు గుండెల్లోనే ఉందని అన్నారు. వారి పార్టీ గుర్తు ఏందో గుర్తులేక గుర్తు పట్టుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. నంద్యాలలో గెలుపు మనదే, మీరు అక్కడే ఉండి టీవీల్లో చూడమని చంద్రబాబు గారికి విన్నవించాను. కానీ, మెజార్టీని ప్రత్యక్షంగా చూసేందుకే ఆయన వచ్చారని వేణుమాధవ్ తెలిపారు.