అమరావతి : రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో టిడిపి ప్రతినిధులు ఓ వినతి పత్రం అందజేశారు. టిడిపి అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడుల సందర్భంగా ఈ ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు టిడిపి అభ్యర్థులపై ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు జరిపారని ఆయనకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ తర్వాత ఐటీ దాడులు జరపడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని అందులో పేర్కొన్నారు. టిడిపి ప్రతినిధుల ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈమేరకు ఐటీ అధికారులతో సీఈవో ద్వివేదీ ఫోన్లో వివరణ కోరారు. దీనిపై నోటీసులు పంపుతామని.. దాడులపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులను ఆయన ఆదేశించారు.