బాబు గెలుపు కోసం రాధా హోమం !

SMTV Desk 2019-04-01 11:39:02  Vangaveeti Radha, chandrababu

ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించడానికి యాగమే కారణమని ప్రచారం జరిగింది. దీంతో ఏపీలోనూ ఎన్నికల వేళ యాగాలు, హోమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పోటీ చేస్తోన్న అభ్యర్థులే స్వయంగా యాగాలు నిర్వహిస్తుంటే, తమ అభిమాన నేతల విజయాన్ని కాంక్షిస్తూ అనుచరులు, పార్టీ కార్యకర్తలు హోమాలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం శారదా పీఠం స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. మార్చి 27నుంచి 29 వరకు నెల్లూరు జిల్లాలో ఈ యాగాన్ని నిర్వహించినట్టు సమాచారం. తాజాగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ యాగం నిర్వహించారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతోపాటు ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు రావాలని ఆకాంక్షిస్తూ ఆయన శ్రీయాగం చేపట్టారు. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో రుత్వికుల ఆధ్వర్యంలో ఈ యాగం ఆదివారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగే శ్రీయాగాన్ని రాధా తాను అవివాహితుడు కావడంతో తన చెల్లెలు, బావలతో చేయిస్తున్నారు. నిన్న ఉదయం రాధా సోదరి ఆషా, ఆమె భర్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట గోపూజ, అనంతరం వాస్తు హోమం నిర్వహించి ఆపై శ్రీయాగం మొదలుపెట్టారు. ఈ యాగం ఏప్రిల్ 3న పూర్ణాహుతితో ముగుస్తుంది. శ్రీయాగం చేయడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, శత్రుపీడ, సంకల్పసిద్ధి జరుగుతుందని వంగవీటి రాధా తెలిపారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని తపిస్తున్న చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ఈ యాగం చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వంగవీటి తల్లి రత్నకుమారి పాల్గొన్నారు. ఇటీవల కర్నూలులోనూ టీడీపీ నేతలు చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే.